కరోనాలో కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. యూకేలో గుర్తించిన కొత్త వేరియంట్ AY.4.2 ప్రపంచ దేశాలను భయపెడుతోంది. కరోనా వైరస్ జన్యువుల్లో జరిగిన మార్పు వల్ల పుట్టుకొచ్చిన ఈ కొత్త రకం వేరియంట్ వ్యాప్తి ఎలా ఉంటుంది? దీని ప్రభావం మనిషిపై ఏ స్థాయిలో పడుతుంది? వైరస్ సోకిన తర్వాత వచ్చే లక్షణాలేమిటి? ఎంత మేరకు సీరియస్ అయ్యే అవకాశం ఉంది? లాంటి విషయాలు ఇంకా ఏ దేశానికీ తెలియదు. దీంతో పలు దేశాలు దీనిపై రీసెర్స్ చేస్తున్నాయి. ఈ క్రమంలో మన దేశం కూడా అప్రమత్తమైంది. ఇండియన్ మెడికల్ రీసెర్స్ కౌన్సిల్ (ఐసీఎంఆర్), నేషనల్ సెంటర్ ఫర్ డీసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) ఈ కొత్త వేరియంట్ AY.4.2పై లోతైన అధ్యయనం చేస్తున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ కొత్త వేరియంట్ వ్యాప్తి తీరు గురించి ఏమీ తెలియకుండా ఇప్పుడే మాట్లాడడం పొరబాటవుతుందన్నారు.
A team is investigating the new COVID19 variant AY.4.2 ... ICMR and NCDC teams study and analyse the different variants: Union Health Minister Mansukh Mandaviya pic.twitter.com/6Htme2RFvR
— ANI (@ANI) October 26, 2021
కాడిలా కంపెనీ తయారు చేసిన కరోనా వాక్సిన్ జైకోవ్ డీ ధరను ఎంత నిర్ణయించాలన్న దానిపై చర్చలు నడుస్తున్నాయని మాండవీయ తెలిపారు. ఇక కొవాగ్జిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి రావాల్సిన అప్రోవల్స్ కు సంబంధించి ఇప్పటికే టెక్నికల్ కమిటీ ఆమోదం లభించిందని, మరో కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. ఆ రెండో కమిటీ ఇవాళ భేటీ అవుతోందని, ఈ సమావేశంలో నిర్ణయం వెలువడుతుందని ఆశిస్తున్నామని చెప్పారు. చిన్న పిల్లలపై కొవాగ్జిన్ చేసిన ట్రయల్స్ కు సంబంధించి మరింత సమగ్రమైన అనాలిసిస్ జరగాల్సి ఉందన్నారు. త్వరలో కోమార్బిడ్ కండిషన్స్ తో ఉన్న పిల్లలకు ఈ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు చెప్పారు.