‘కాశ్మీర్కోసం ఎంతకైనా తెగిస్తాం’ అని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అనడాన్ని ఇండియా సహా ఇరుగు పొరుగు దేశాలన్నీ లైట్గా తీసుకున్నాయి. కాశ్మీర్ ప్రాంతం మీది ఎప్పుడయ్యిందో చెప్పమని ఇండియా గట్టిగా అడిగేసరికి నోరు బందయ్యింది. ఇంతకీ, ఇమ్రాన్ మాటలు సహజంగా వచ్చాయా, లేక సైన్యం స్క్రిప్ట్ని ఆయన చదివారా అనే అనుమానాలు వచ్చాయి. నిస్సందేహంగా అవి పాక్ మిలిటరీ మాటలే! దేశంలో ఆర్థిక, సామాజిక పరిస్థితులు చాలా దారుణంగా మారిపోయినందున… ఇండియా బూచిని చూపించి పబ్బం గడుపుకోవాలని భావిస్తోంది.
బాగు పడాలంటే అప్పు చేయాలి, లేదా యుద్ధం చేయాలి అనే ఫార్ములాతోనే పాకిస్థాన్ సాగుతోంది. ప్రపంచ దేశాలన్నీ శాంతి, సుస్థిరత కోరుకుంటున్నందున ఇప్పటికిప్పుడు అప్పులిచ్చి ఆదుకునే పరిస్థితి లేదు. ఇరుగుపొరుగు దేశాలలో రక్తం పారిస్తున్న మిలిటెంట్ సంస్థలు పాక్లోనే తలదాచుకుంటున్నాయని సాక్ష్యాలతో రుజువైంది. సైన్యం మద్దతుతో ప్రధానమంత్రి కుర్చీలో కూర్చున్న మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా తయారైంది. అధ్వాన్నంగా మారిన ఆర్థిక, సామాజిక పరిస్థితుల్ని చక్కబెట్టడమే ఆయన ఫస్ట్ టార్గెట్. స్వతహాగా క్రికెటర్ కావడం, నాన్–కన్వెన్షనల్ పొలిటికల్ లీడర్ కావడం, పూర్తిగా వెస్ట్రన్ లైఫ్స్టయిల్తో ఉండడం ఇమ్రాన్ ప్రత్యేకతలు. ఆయన అధికారంలోకి వచ్చాక, ఆ తర్వాతకూడా ఇండియాపై పెద్దగా వ్యతిరేకత చూపలేదు. అయితే, రానురాను సైన్యం వత్తిడి పెరగసాగింది.
ఇండియాని బూచిగా చూపించకపోతే పాక్లో సైన్యానికి మనుగడ ఉండదు. పుల్వామాలో మిలిటెంట్ దాడితో ఇండియా వైఖరిలో పూర్తి మార్పు వచ్చింది. ఇకపైనా మిలిటెన్సీ విషయంలోనూ, దానిని ఎంకరేజ్ చేస్తున్న దేశం విషయంలోనూ మునుపటిలా ఊరుకునేది లేదన్న సంకేతాన్ని స్పష్టంగా పంపించింది. మొట్టమొదట పాక్ని మోస్ట్ ఫేవర్డ్ నేషన్ జాబితా నుంచి తొలగించింది. అక్కడి వస్తువు దిగుమతిపై కొన్ని కట్టుబాట్లు పెట్టింది. ఇక్కడి నుంచి వెళ్లే ఎగుమతులపై సుంకాన్ని పెంచింది. కాశ్మీర్లో అమలవుతున్న ఆర్టికల్–370ని రద్దు చేసేసింది. ఇవన్నీ పాక్ ఆర్థిక మూలాలను కుదిపేశాయి.
అక్కడ ప్రజాస్వామ్యాన్ని, న్యాయ వ్యవస్థనుసైతం సైన్యమే నడిపిస్తుంది. ప్రధానమంత్రి ఎవరయినా సైనిక ప్రయోజనాలే ముఖ్యం. ఇమ్రాన్ ఖాన్ చీఫ్గా ఉన్న పిటిఐకి పాకిస్థాన్ సైన్యం, గూఢచారి సంస్థ ఐఎస్ఐతో పాటు అక్కడి మిలిటెంట్ నెట్వర్క్కూడా గట్టి మద్దతు ఇచ్చాయన్నది బహిరంగ రహస్యం. ఇమ్రాన్ ఏం మాట్లాడాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మిలిటరీ స్క్రిప్ట్ ప్రకారం నడుచుకోవలసిందే.
డాలర్కి 157 పాక్ రూపాయలు!
ఇమ్రాన్ అధికారంలోకి వచ్చేనాటికే దేశ ఆర్థిక పరిస్థితి దిగజారి ఉంది. ఇటీవల డాలర్ విలువ చాలా రెట్లు పెరిగింది. కేవలం 12 నెలల్లోనే పాక్ రూపాయి విలువ డాలర్కి 123 నుంచి 157 రూపాయలకు పడిపోయింది. వచ్చే మార్చి నాటికి డాలర్కి 250 రూపాయలకు పడిపోవడం ఖాయమని ఫైనాన్షియల్ ఎనలిస్టులు చెబుతున్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఇదివరకే ఒకసారి బెయివుట్ ప్యాకేజీతో దివాళా అంచు నుంచి పైకి లాగింది. తాజాగా 600 కోట్ల డాలర్లతో (పాక్ రూపాయల్లో 94,500 కోట్లు) మరో బెయిలవుట్ ప్యాకేజీని ప్రకటించాల్సి వచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ (పాక్ రిజర్వ్ బ్యాంక్)లో ఫారిన్ ఎక్చేంజీ నిల్వలు అడుగంటిపోయాయి.
చైనా పెట్టుబడులతో భారం
చైనా ‘ఒన్ బెల్డ్–ఒన్ రోడ్’ పేరుతో వాణిజ్య విస్తరణకు దిగింది. పాకిస్థాన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులపై పెట్టుబడి పెడుతోంది. పాక్లో పూర్తిగా మ్యాన్ఫాక్చరింగ్, ప్రొడక్షన్ వ్యవస్థలు కుదేలైపోవడంతో దిగుమతులపై ఆధారపడి కాలం వెళ్లదీస్తోంది. ఇక్కడి టెక్స్టైల్ మార్కెట్కి చైనా తయారీ చౌక బట్టలు గట్టి పోటీ ఇస్తున్నాయి. చైనా పెట్టుబడులు తెల్లఏనుగులా మారుతున్నాయన్న భయం ఉంది. అసలు ఇమ్రాన్ అధికారంలోకి వచ్చేసరికే బిజినెస్ రేటింగ్ కొనప్రాణంతో ఉంది. ఇప్పుడు ‘చైనా పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ (సిపీఈసీ)’ పేరుతో మరింత భారం పెరగనుంది.