
నేషనల్ హెరాల్డ్ కేసులో 9 గంటలకు పైగా విచారణ
న్యూఢిల్లీ/ హైదరాబాద్, వెలుగు: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ మాజీ చీఫ్, ఎంపీ రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారిచింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీల్యాండరింగ్ యాక్ట్ సెక్షన్ 50 కింద రాహుల్ స్టేట్మెంట్ ను ఈడీ రికార్డు చేసింది. మనీ ల్యాండరింగ్ కేసులో ఈడీ డిప్యూటీ, అసిస్టెంట్ డైరెక్టర్లు రాహుల్ను సుదీర్ఘంగా ప్రశ్నించారు. సోమవారం ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు తొలి విడతగా విచారణ జరిపారు. అనంతరం లంచ్ విరామం ఇచ్చారు. సోనియాగాంధీ చికిత్స పొందుతున్న గంగారాం హాస్పిటల్కు భోజన విరామ సమయంలో రాహుల్ వెళ్లి ఆమెను పరామర్శించారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు ఈడీ ముందు హాజరవగా.. రాత్రి 10 గంటల వరకు విచారించారు. మొత్తంగా 9 గంటలకు పైగారాహుల్ను అధికారులు విచారించారు. మంగళవారం కూడా విచారణకు రావాలని సమన్లు జారీ చేసినట్లు తెలుస్తున్నది. ఈ కేసులో కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీని ఈ నెల 23న ఈడీ విచారించనుంది.
రాహుల్కు మద్దతుగా సత్యాగ్రహ ర్యాలీ
విచారణకు హాజరయ్యే ముందు రాహుల్ తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి ఢిల్లీ తుగ్లక్ లేన్ లోని తన నివాసం నుంచి ఏఐసీసీ ఆఫీసుకు చేరుకున్నారు. అప్పటికే కాంగ్రెస్ పాలిత ప్రాంతాలైన చత్తీస్ గఢ్, రాజస్థాన్ సీఎంలు, ఏఐసీసీ జనరల్ సెక్రటరీలు, సీడబ్ల్యూసీ సభ్యులు, ఎంపీలు, మాజీ ఎంపీలు, ఏఐసీసీ మెంబర్ సెక్రటరీలు, పెద్ద ఎత్తున పార్టీ సీనియర్ నేతలు అక్కడికి చేరుకున్నారు. ఇందులో తెలంగాణ నుంచి ఏఐసీసీ సెక్రటరీ సంపత్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ తెలంగాణ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ కూడా ఉన్నారు. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తూ.. రాజకీయ ప్రత్యర్థులపై బోగస్ కేసులు పెడుతున్నదని నేతలు ఆరోపించారు. ఈ సంస్థల పేరుతో నేతల్ని వేధిస్తోందని విమర్శించారు. రాహుల్ కు మద్దతు తెలుపుతూ ఆయన వెంట ఏఐసీసీ నుంచి ఈడీ ఆఫీసు వరకు సత్యాగ్రహ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాహుల్ ఒక్కడినే పోలీసులు ఈడీ ఆఫీసుకు తరలించారు. కాంగ్రెస్ నేతలను పార్లమెంట్ స్ట్రీట్, తుగ్లక్ రోడ్, మందిర్ మార్గ్, తిలక్ మార్గ్ పోలీసు స్టేషన్లకు తరలించారు. ఆ వెంటనే విడుదల చేశారు. అంతకుముందు తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్ లో కేసీ వేణుగోపాల్, ఇతర నేతల్ని ప్రియాంక గాంధీ పరామర్శించారు.
ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కాలికి గాయం
రాహుల్ను ఈడీ ఆఫీసుకు తరలిస్తున్న సందర్భంలో పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కాలికి గాయమైంది. సంపత్ మీడియాతో మాట్లాడుతూ.. నేషనల్ హెరాల్డ్ సబ్జెక్ట్ కు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదన్నారు. 2012 ఎలక్షన్ కమిషన్ కూడా ఇదే విషయాన్ని చెప్పిందని పేర్కొన్నారు. 2015 ఆగస్టులో ఈ కేసును కొట్టివేస్తే.. కేంద్రం సెప్టెంబర్ లోనే కేసును తిరగదోడిందన్నారు. రాజ్యాంగ సంస్థలైన ఈడీ, సీబీఐ, ఇతర సంస్థల ద్వారా ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ, గాంధీ ఫ్యామిలీని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
ఇది పూర్తిగా ఫాల్స్ కేసు: ఉత్తమ్
కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులను సీబీఐ, ఈడీ, ఇన్కం ట్యాక్స్ సంస్థల ద్వారా అనేక విధాలుగా వేధిస్తున్నదని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ‘‘ఇది పూర్తిగా ఫాల్స్ కేసు. ఏమీ లేని కేసులో రాజకీయ కక్షసాధింపు చేస్తున్నరు. అందువల్లే రాహుల్ కు మద్దతుగా ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలుపుతున్నాం” అని ఆయన అన్నారు. ఈ నెల 23 న సోనియాగాంధీ విచారణకు హాజరయ్యే సందర్భంలోనూ ఆమె వెంట నిలబడతామని ఉత్తమ్ చెప్పారు. ఎలాంటి ఆధాలు లేకపోవడంతో 2015 లో ఈ కేసును మూసివేశారని కాంగ్రెస్ తెలంగాణ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ అన్నారు. కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ 'దేశ్ జోడో’ కార్యక్రమానికి పిలుపునిచ్చారని, దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని ఆరోపించారు.
సెంట్రల్ ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు
ఈడీ విచారించనున్న నేపథ్యంలో సెంట్రల్ ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఏఐసీసీ ఆఫీస్ ఉన్న అక్బర్ రోడ్ ను బారికేడ్లతో మూసేశారు. ఎంపీలు, మాజీ సీఎంలు, పార్టీ సీనియర్ నేతలు మినహా ఎవర్నీ అనుమతించలేదు. అలాగే, ఈడీ ఆఫీసు ముందు పారామిలటరీ బలగాలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. దీంతో సెంట్రల్ ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ జాం అయింది.