చాలామందికి ‘సొంతింటి కల’ ఉంటుంది. అందులోనూ కొందరు అది ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలో కూడా డిజైన్ చేసుకుంటారు. థాచోలాత్ గోపాలన్కి కూడా అలాంటి డ్రీమ్ ఉంది. చిన్నప్పట్నించి ఆయన నదిలో ఇల్లు కట్టుకోవాలి అనుకునేవాడు. తన ఇల్లు బోట్లా ఉండాలనుకునేవాడు. కానీ.. అది అంత ఈజీ కాదని అర్థమైపోయింది. అందుకే ఆ కలకు కాస్త కళను జోడించి కొలనులో అందమైన ఇంటిని కట్టుకున్నాడు.
కేరళలోని కోజికోడ్కి చెందిన గోపాలన్ ఒక పర్యావరణవేత్త. తండ్రి నుంచి వారసత్వంగా 1990లో కొంత వరి పొలం వచ్చింది. ఆ పొలాన్ని కొలాప్స్ చేయకుండానే ఆ ప్లేస్లో ఒక ఇల్లు కట్టుకోవాలి అనుకున్నాడు. పైగా వరి పొలాన్ని ఇల్లు కట్టుకునేందుకు అనుగుణంగా మార్చాలంటే చాలా ఖర్చవుతుంది. పొలంలో చాలా మట్టి పోయాల్సి వస్తుంది. పైగా నీళ్లలో కట్టుకున్న ఇంట్లో ఉండాలనే కోరిక ఉందాయనకు. అందుకే పొలంలోనే 1992లో నాలుగు సెంట్ల స్థలంలో ఇల్లు కట్టుకున్నాడు. అందుకోసం ఆయన 15 కాంక్రీట్ పిల్లర్స్ని కట్టించాడు. వాటిపై ఇంటిని కట్టారు. ఈ ఇల్లు కట్టడానికి కేవలం 75,000 రూపాయలు ఖర్చయ్యింది. ఇంటి పనులు భార్యా, పిల్లలే ఎక్కువగా చేశారు.
ఆ ఇంటికి వచ్చిన వాళ్లంతా అచ్చం ‘ఎయిర్ కండిషన్ ఉన్న ఇంట్లో ఉన్నట్టే ఉంది’ అంటుంటారు. కానీ.. ఇంట్లో కనీసం ఫ్యాన్ కూడా వేయరు. నీళ్లపై ఉండడం వల్ల చల్లగా ఉంటుంది. ఇంటి గోడలు కట్టేందుకు ఎక్కువగా మట్టినే వాడారు. ఆ ఇంటి కింద ఉన్న నీళ్లలో చేపలు, కప్పలతోపాటు పాములు కూడా ఉన్నాయి. కానీ.. అవెప్పుడూ ఇంట్లోకి రాలేదని చెప్పాడు గోపాలన్. ఆ నీళ్లలో వాటర్ లిల్లీస్ కూడా పెంచుతున్నాడాయన.
ఆర్గానిక్ ఫార్మింగ్
గోపాలన్ తన ఇంట్లో రకరకాల ఆయుర్వేద మొక్కలను పెంచుతున్నాడు. తన కాంపౌండ్లో దాదాపు 27 రకాల మలయాళ జన్మ నక్షత్రాల చెట్లను పెంచుతున్నాడు. వాళ్ల రాశులను బట్టి అడిగిన వాళ్లకు వాటిని ఇస్తున్నాడు. అంతేకాదు ఆయన పక్షులను, ఆవులను కూడా పెంచుతున్నాడు. ప్రతి రోజు పక్షులకు, ఆవులకు ఫుడ్ పెట్టాకే ఆయన భోజనం చేస్తాడు. ఆ ఆవుల పాలు కూడా పితకరు. వాటి పాలు మొత్తం దూడలకే వదిలేస్తారు. అంతేకాకుండా ఆయన ఆర్గానిక్ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నాడు. తన పొలంలో గుమ్మడికాయ, పసుపు, బీన్స్, అరటి పంటలు పండిస్తున్నాడు. పంటలకు ఆవు పేడను ఎరువుగా వేస్తున్నాడు. ఇలా పర్యావరణానికి మేలు చేసే ఎన్నో పనులు చేసినందుకు 2017లో ఆయనకు ‘వనమిత్ర’ అవార్డు (కేరళలో ప్రతి సంవత్సరం జిల్లాలో ఒక్కరికి ఇస్తారు) దక్కింది.
Read more news…