న్యూఢిల్లీ: బ్యాంకుల దగ్గర క్లెయిమ్ చేసుకోకుండా మిగిలిపోయిన డిపాజిట్లు (అన్క్లెయిమ్డ్) ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ.42,270 కోట్లకు చేరుకున్నాయి. అంతకు ముందు ఏడాది కాలంలో 28 శాతం పెరిగాయి. పది లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల పాటు పనిచేయకుండా ఉన్న అకౌంట్లలోని డిపాజిట్లను అన్క్లెయిమ్డ్ డిపాజిట్లుగా పరిగణిస్తారు. కిందటేడాది మార్చి 31 నాటికి రూ.32,934 కోట్ల అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఈ ఏడాది మార్చి నాటికి ప్రభుత్వ బ్యాంకుల దగ్గర రూ.36,185 కోట్ల విలువైన అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉన్నాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కే కరాద్ రాజ్యసభలో వెల్లడించారు.
ఈ ఫండ్స్ను ఆర్బీఐ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ (డీఈఏ) ఫండ్ కు పంపుతారు. ఈ అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను తిరిగి తమ ఓనర్లకు పంపేందుకు ఆర్బీఐ చర్యలు తీసుకుంటోందని కరాద్ వెల్లడించారు. ‘వీటి వివరాలను తమ వెబ్సైట్లో పెట్టాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. సంబంధిత కస్టమర్లను సంప్రదించాలని, ఒకవేళ అకౌంట్ హోల్డర్ చనిపోతే వారి లీగల్ వారసులను సంప్రదించాలని ఆదేశించింది. అంతేకాకుండా అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను గుర్తించేందుకు బోర్డు ఆమోదంతో కొన్ని రూల్స్ రెడీ చేయాలని, గ్రీవెన్స్ రిడ్రస్సల్ మెకానిజంను ఏర్పాటు చేయాలని తెలిపింది. అన్క్లెయిమ్డ్ డిపాజిట్ స్టేటస్ను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలని ఆర్బీఐ సలహా ఇచ్చింది’ అని కరాద్ పేర్కొన్నారు.
క్యాంపెయిన్తో రూ.1,432.68 కోట్లు రిటర్న్..
ఇటువంటి డిపాజిట్ల వివరాలు తెలుసుకునేందుకు సెంట్రలైజ్డ్ వెబ్సైట్ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ గేట్వే టూ యాక్సెస్ ఇన్ఫర్మేషన్ (ఉడ్గం) ను ఆర్బీఐ తీసుకొచ్చిందని కరాద్ అన్నారు. దీనికి తోడు ‘100 డేస్ 100 పేస్’ క్యాంపెయిన్ను కూడా స్టార్ట్ చేసిందన్నారు. ఈ క్యాంపెయిన్లో భాగంగా ప్రతీ జిల్లాలోని టాప్ 100 అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను 100 రోజుల్లో బ్యాంకులు సెటిల్ చేస్తాయి. ఈ క్యాంపెయిన్ ఈ ఏడాది జూన్ 1 న మొదలై సెప్టెంబర్ 8 వరకు కొనసాగిందని కరాద్ వెల్లడించారు. క్యాంపెయిన్ ముగిసే సమయానికి 31పెద్ద బ్యాంకులు రూ. 1,432.68 కోట్లను అర్హత ఉన్న వారికి రిటర్న్ చేశాయని వివరించారు. డీఈఏ ఫండ్లో ఈ 31 బ్యాంకుల నుంచి వచ్చిన అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు 90 శాతం ఉన్నాయి.
ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం (పీఎంఈజీపీ) కింద ఇచ్చిన లోన్లను కూడా కలుపుకొని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల గ్రాస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ (ఎన్పీఏలు) 2019 మార్చి 31 నాటికి రూ.9,33,779 కోట్లుగా రికార్డయ్యాయని మరో ప్రశ్నకు సమాధానంగా కరాద్ వివరించారు. ఇది బ్యాంకుల అడ్వాన్స్ల్లో 9.07 శాతానికి సమానమన్నారు. ‘2020 మార్చి 31 నాటికి రూ.8,96,082 కోట్లకు (గ్రాస్ ఎన్పీఏ రేషియో 8.21 శాతం), 2021 మార్చి 31 నాటికి రూ.8,35,051 కోట్లకు (7.33 శాతం) గ్రాస్ ఎన్పీఏలు తగ్గాయి. 2022 మార్చి 31 నాటికి రూ.7,42,397 కోట్లకు (5.82 శాతం), ఇక్కడి నుంచి ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ.5,71,544 కోట్లకు (3.87 శాతం) దిగొచ్చాయి’ అని ఆయన వివరించారు. ‘వీటితో పాటు బ్యాంకుల స్లిప్పేజ్ రేషియో ( ఎన్పీఏలకు కొత్తగా యాడ్ అయినవి, ఏడాది ప్రారంభంలోని అడ్వాన్స్ల రేషియో) 2019 –20 లోని 3.74 శాతం నుంచి 2022–23 లో 1.78 శాతానికి దిగొచ్చింది’ అని పేర్కొన్నారు.
పెరిగిన డిజిటల్ ట్రాన్సాక్షన్లతో పోలిస్తే ఫ్రాడ్స్ తక్కువే..
బ్యాంక్ ఫ్రాడ్స్ గురించి కూడా కరాద్ రాజ్యసభలో మాట్లాడారు. రూ. లక్ష కంటే ఎక్కువ జరిగిన బ్యాంక్ ఫ్రాడ్స్ను ఆర్బీఐ మూడు కేటగిరీలుగా విభజించిందన్నారు. ‘కార్డ్స్/ ఇంటర్నెట్ - క్రెడిట్ కార్డ్స్, కార్డ్స్/ ఇంటర్నెట్ - డెబిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్’ ఇలా మూడు భాగాలుగా వేరు చేసిందని చెప్పారు. ఆర్బీఐ డేటా ప్రకారం, 2021-22 లో 3,596 బ్యాంక్ ఫ్రాడ్లు నమోదవ్వగా, 2022-23 లో 6,659 ఫ్రాడ్స్ రికార్డయ్యాయని వివరించారు. పెరుగుతున్న డిజిటల్ ట్రాన్సాక్షన్లలో వీటి నెంబర్ తక్కువని అన్నారు. సైబర్ ఫ్రాడ్స్తో కలిపి వివిధ మోసాలపై దర్యాప్తు చేయడానికి, కోర్టుకి తీసుకెళ్లడానికి, మోసాలను ముందుగానే గుర్తించడానికి, ఆపడానికి రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలు బాధ్యత వహిస్తున్నాయని కరాద్ వెల్లడించారు.