చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక సోదరుడు యుగంధర్ ఈడీ విచారణకు హాజరయ్యారు. క్యాసినో వ్యవహారంతో ఉన్న లింకులపై వారిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. పంజాగుట్టలోని ఊర్వశి బార్ మాజీ ఎంపీ బుట్టా రేణుక సోదరుడు యుగంధర్ దే. ఫారిన్ ఎక్స్ చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ను ఉల్లంఘించారనే అభియోగాలను ఏపీ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి ఎదుర్కొంటున్నారు.
కాసేపట్లో ఎమ్మెల్సీ ఎల్.రమణ, మెదక్ డీసీసీబీ చైర్మన్ దేవేందర్ రెడ్డిలను ఈడీ అధికారులు విచారించనున్నారు. ఇప్పటికే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తమ్ముళ్లు తలసాని మహేష్ యాదవ్, తలసాని ధర్మేంద్ర యాదవ్ లను ఈడీ విచారించింది. వాళ్ల ఫోన్ కాంటాక్ట్స్, వాట్సాప్ చాటింగ్స్, ఫ్లయిట్ టికెట్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్ల ఆధారంగా 10 గంటలపాటు ప్రశ్నించింది.
కీలకంగా మారిన చీకోటి కాంటాక్ట్స్చిట్టా
హైదరాబాద్కు చెందిన ముగ్గురు మంత్రులతో చికోటి ప్రవీణ్కు ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. చికోటి క్యాసినో నెట్వర్క్లో 18 మంది ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు, 280 మందికి పైగా రెగ్యులర్ కస్టమర్లు ఉన్నట్లు ఈడీ గుర్తించింది. ఏపీ, తెలంగాణలోని వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, వ్యాపారవేత్తలు చీకోటి క్యాసినో బిజినెస్లో పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ అధికారులు ఆధారాలు సేకరించారు. హాంకాంగ్, ఇండోనేషియా, శ్రీలంక, నేపాల్, గోవాలో ప్లేయింగ్ కార్డ్స్, క్యాసినో క్లబ్స్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేసినట్లు ఆధారాలు రాబట్టారు. గోవా, నేపాల్లో క్యాసినో లీగల్ కావడంతో అక్కడే పదుల సంఖ్యలో క్యాసినో సెంటర్లు ఏర్పాటు చేసినట్లు, బినామీల పేర్లతో సెంటర్లు నిర్వహిస్తున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు.