వైన్ షాపుల్లో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చాం.. మీరేం ఇచ్చారు: శ్రీనివాస్ గౌడ్

 వైన్ షాపుల్లో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చాం.. మీరేం ఇచ్చారు: శ్రీనివాస్ గౌడ్

బీజేపీ బీసీల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా క్యాంప్ ఆఫీసులో 2023, అక్టోబర్ 21వ తేదీ శనివారం మీడియా సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. 80 కోట్ల జనాభా ఉన్న బీసీలకు 2 వేల కోట్ల బడ్జెట్ కూడా ఇవ్వని బీజేపీ... బీసీల గురించి మాట్టాడటం విడ్డూరంగా ఉందని అన్నారు.  దేశ ప్రదాన మంత్రిగా బీసీ ఉన్నా.. బీసీలకు ఏమి చేశారు... ఒక బీసీ మంత్రిత్వ శాఖ కూడా ఇవ్వలేదు అని మండిపడ్డారు. 

బీసీ జనగణన కూడా చేపట్టడం లేదని..  ఇలాంటి మీరు ఇపుడు ఓడిపోయే స్థానాల్లో బీసీలని నిలబెట్టి ఓడించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రిజర్వేషన్ సౌకర్యం కల్పించి ఉంటే.. 33 శాతం వచ్చే అవకాశం ఉండేదని, కేవలం ఎంఎల్ఏలుగా గెలిస్తే బీసీలు అభివృద్ధి చేందుతారా?, మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీసీ గురుకులాలు పెట్టారా? అని ప్రశ్నించారు.చట్ట సభల్లో అవకాశం లేకున్నా.. ఎంఎల్సీలుగా మేం అవకాశం ఇచ్చామన్నారు.

Also Read : కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ పై ఉత్కంఠ.. 20 సీట్లపై కొలిక్కిరాని చర్చలు

ఎంఎల్సీలుగా బీసీ, ఎస్టీలకు అవకాశం ఇస్తే.. మీరు గవర్నర్ ను అడ్డం పెట్టుకొని అడ్డుకున్నారని దుయ్యబట్టారు. మీరు గెలిచేదే ఐదు సీట్లు లేవు.. మీరు బీసీలకు సీట్లు ఇస్తే గెలుస్తారా అని ఎద్దేవా చేశారు. నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే మీరు ఎందుకు ఓ బీసీగా ఉన్న బండి సంజయ్ ని మార్చి కిషన్ రెడ్డినీ అధ్యక్షుడిగా చేశారని అన్నారు.  బీసీలకు అండగా ఉన్న పార్టీ బిఆర్ఎస్ మాత్రమేనని.. బీసీలతోపాటు అన్ని వర్గాలకు అండగా ఉందన్నారు. కాంట్రాక్ట్ లలో.. వైన్ షాపుల్లో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ మా బిఆర్ఎస్ పార్టీ అని పేర్కొన్నారు.